![]() |
||
![]() |
||
|
|
బ్రహ్మాండ పురాణంసమస్త బ్రహ్మాండాన్ని ఆధారంగా తీసుకొని బ్రహ్మచేత భవిష్యకల్పవృత్తాంతంగా చెప్పబడిన పురాణం కాబట్టి దీని పేరు బ్రహ్మాండపురాణం అయ్యింది. ఇందులోని శ్లోక సంఖ్య 12,200 భువన కోశం లేక ఈ సకల చరాచర బ్రహ్మాండ వర్ణన అన్ని పురాణాలలోను ఉంటుంది. కానీ ఈ పురాణం ఈ బ్రహ్మాండం (విశ్వం) అంతటిని సాంగోపాంగంగా వరిస్తుంది. నారదపురాణాన్ని అనుసరించి దీనిలో 161 అధ్యాయాలు, 12,000 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు పురాణంలో ఉన్న విషయానుక్రమణి నారద పురాణంలో చెప్పబడిన విషయానుక్రమణికతో సరిపోతున్నది. కూర్మపురాణం చెప్పిన పురాణపు పేర్లలో ఇది వాయవీయ బ్రహ్మాండపురాణం అని పేర్కొంటున్నది. ఈ విషయాన్ని అనుసరించి మన పురాణాల పై పరిశోధన చేసిన పాశ్చాత్య పురాణ పండితులు ఇది వాయుపురాణము యొక్క విస్తృత రూపమని, దీనికి మూలం వాయు పురాణమేనని భావించారు. కానీ ఇది సరియైన అభిప్రాయం కాదు. నారదపురాణాన్ని అనుసరించి వాయుదేవుడు వ్యాసునికి ఈ పురాణాన్ని బోధించాడని తెలుస్తున్నది. అందువలననే సరిగా ఇది వాయుప్రోక్త బ్రహ్మాండపురాణమని చెప్పబడింది. ఈ పురాణ ప్రథమ ఖండంలో విశ్వభూగోళ వర్ణన విస్తృతంగా చేయబడింది. జంబూ ద్వీపము, అందులోని పర్వత, నదీ నద వర్ణన అనే అధ్యాయాలలో (66-72 వరకు) చేయబడింది. భద్రాశ్వ, కేతుమాల, చంద్రద్వీప, కింపురుషవర్ష, కైలాస, శాల్మిల ద్వీప, కుశద్వీప, క్రౌంచద్వీప, శాకద్వీప, పుష్కరద్వీపము వంటి అనేక వర్షములు, దీపముల వర్ణన విభిన్న అధ్యాయాలలో, ఆకర్షణీయంగా సమగ్రంగా లభ్యం అవుతున్నది. ఈ పురాణపు తృతీయ పాదంలో భారతదేశంలోని ప్రసిద్ధులైన క్షత్రియ వంశ వివరణ చారిత్రక దృష్టితో చాలా విలువగల భాగము. ఈ పురాణాన్ని గురించిన ఇంకొక ప్రత్యేకత ఏమంటే క్రీ.శ. 5వ శతాబ్దంలో బ్రాహ్మణులు ఈ పురాణాన్ని జ్వాలా(బలి) ద్వీపానికి తీసుకొనిపోయారు. అక్కడ ఇది ప్రాచీన జావాభాష అయిన “కలిభాష”లోకి అనువదించబడింది. ఆ అనువాదం ఈ రోజుకు ఉపలబ్ధం అవుతున్నది. అందువలన ఈ పురాణం చాలా ప్రాచీన కాలానికి చెందినదిగా భావించవచ్చును. ఈ పురాణము యొక్క 16, 17, 18 అధ్యాయాలలోని భవిష్య కల్పవృత్తాంతం విస్తారంగా వర్ణితమైంది. ఈ రకమైన విస్తృతకల్పవర్ణనం మిగిలిన ఇతర పురాణాలలో లభించదు. అందువలన లభ్యం అవుతున్న బ్రహ్మాండపురాణ అస్తిత్వం, మౌలికత, మహాపురాణత్వాన్ని గురించి ఎటువంటి సందేహాలు పెట్టుకొనవలసిన అవసరం లేదు. బ్రహ్మాండపురాణం అష్టాదశ పురాణాలు అన్నింటిలోను ప్రాచీనతమమైనదని పురాణతత్త్వజ్ఞుల భావన. స్కాందపురాణంలాగానే దీనిలో కూడా అనేక మాహాత్మ్యాలు వర్ణింపబడ్డాయి. దీని ప్రథమ ఖండంలో నదులు తీర్థాల వర్ణనతరువాత నక్షత్రమండలము యుగములు, మన్వంతరాల విపుల వివరణ ఉన్నది. విశ్వ విఖ్యాతులైన క్షత్రియ ప్రభువుల వంశ వర్ణనము చారిత్రకంగా విలువైనట్టిది. నారదపురాణ సూచికను అనుసరించి అధ్మాత్మ రామాయణము ఇందులోని భాగమే. కానీ ప్రస్తుతం ఉపలబ్ధం అవుతున్న బ్రహ్మాండ పురాణంలో అధ్యాత్మ రామాయణం లభ్యంకావటం లేదు. ఈ అధ్యాత్మరామాయణము శ్రీరామ చరిత్రను ఆధ్యాత్మికముగా వ్యాఖ్యానించిన గ్రంథము. దీనిని అనుసరించి రాముడు పురుషుడు. సీత ప్రకృతి. శ్రీరాముడు పరబ్రహ్మము, సీత ఆయన యొక్క అనిర్వచనీయమైన మాయ. ఈ ఇద్దరి లీలా విలాసమే ఈ సర్వప్రపంచము. బ్రహ్మ, మాయతో కూడా భారాన్ని తగ్గించడంకోసం పరబ్రహ్మమైన రాముని కోరగా ఆయన ఈ భూలోకములో శ్రీరామునిగా అవతరించి తన లీలలను విస్తారంగా ప్రదర్శించాడు. బ్రహ్మాండ పురాణం నుంచి రామాయణకథ విడిపోయి అధ్యాత్మ రామాయణంగా ప్రసిద్ధి చెందిందని పండితుల విశ్వాసం. లేకపోతే రామాయణ కథ దాదాపు అన్ని ఇతర పురాణాలలోను ఉన్నదే. కానీ అధ్యాత్మ రామాయణంలో అది బాగా విస్తరించబడింది. నారదపురాణంలో చెప్పబడిన బ్రహ్మాండ పురాణ విషయానుక్రమణికలో రామాయణ ప్రసక్తి లేదు. చెప్పబడుతున్న శ్లోకాల సంఖ్య అధ్యాత్మ రామాయణము, లలితోపాఖ్యానము కలవనిదే పూర్తికాదు. ఈ రెండు విడి గ్రంథాలే గాక బ్రహ్మాండ పురాణం నుంచి ఇంకా గణేశ కవచం, తులసీకవచం హనుమత్కవచం, సిద్ధ లక్ష్మీస్తోత్రం, సీతాస్తోత్రం, లలితా సహస్రనామస్తోత్రం, లలితోపాఖ్యానం, సరస్వతీస్తోత్రం వంటివి వేరుగా విదదీయవచ్చును. ఈ పురాణంలో పరశురామచరిత్ర కూడా సవిస్తరంగా చెప్పబడింది. పరశు రామునితో దృఢ సంబంధం ఉండటం చేతను, సహ్యపర్వత గోదావరీ ప్రాంతాలను అధికంగా వర్ణించటం చేతను, ఈ పురాణం ఆ ప్రాంతాలలో రచింపబడి ఉంటుందని, దీని లోని కొన్ని భాగాలు ప్రాచీనమైనవని అందువలన ఇది క్రీ.పూ. 1,2 శతాబ్దాలలోనే రచితం అయి 600-900 సంవత్సరాలలో పరిపూర్ణం అయి ఉంటుందని పండితుల అభిప్రాయం. మహా పురాణాలలో చివరి స్థానాన్ని ఆక్రమిస్తున్న బ్రహ్మాండ పురాణం వాయు పురాణంలాగానే నాలుగు పాదాలుగా విభజించటం జరిగింది. 1. ప్రక్రియాపాదము 2. అనుషంగ పాదము, 3. ఉపోద్ఘాత పాదము, 4. ఉపసంహార పాదము. ఇందులో మొదటి రెండు పాదాలైన ప్రక్రియ, అనుషంగాలను పూర్వ భాగమని తరువాత తృతీయ పాదమైన అనుషంగ పాదాన్ని మధ్యభాగమని నాల్గవదైన ఉపసంహార పాదాన్ని ఉత్తర భాగమని పిలుస్తారు. వీనిలో మొత్తం 161 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పురాణంలో నారద పురాణానుసారం 12 వేల శ్లోకాలు మత్స్య పురాణానుసారం 12 వేల రెండు వందల శ్లోకాలు ఉన్నాయి. లోకా సమస్తా సుఖినో భవంతు
|
|
www.sanatanadharm.com - play store app (sanatana dharm) |
||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India. |
||